4, ఏప్రిల్ 2020, శనివారం

ఆఆహాహా... ఆఆఆహాహాహా...
కదలకండి మనుషులైతే
కడుక్కోండి మమత ఉంటే
సబ్బులతో .. శానిటైజర్లతో
కరకు గుండె కరోనా చచ్చేవరకు..

జాతి మత కుల భేదాలన్నీ తుడిచి
కోవిడనే విష వైరస్‌ కాటేసింది
నాల్గంకెల మరణాలే లక్ష్యంగా
రాజూ పేదా అని దయ లేకుండా..
విశ్వమాత విలపించెను భోరుభోరునా
పొంగే కన్నీరే సప్త సముద్రాలుగా..

అమ్మా అని అలమటించె బిడ్డకేమి తెలుసు
ఐసొలేషను గదిలో మృత్యువుతో పోరాడుతోందని..
బిడ్డకొరకు పరితపించె తల్లికేమి తెలుసు
పర దేశపు మరణాల్లో అతడూ ఒకడని..

అధికారులు.. పాత్రికేయులు.. పారిశుధ్య పనివారలు
రేయనకా పగలనకా రోడ్డుమీద ఉంటుంటే
కంటిమీద కునుకు లేక ఇంటిముఖం చూడలేక
పోలీసులు.. డాక్టర్లు యమ యాతన పడుతుంటే
కొంచెమైన బుద్ధి లేక దాడులెందుకు చేస్తార్రా?

ఇంతమంది దేవుళ్లయి మనకు సేవ చేస్తుంటే
నువ్వెందుకు పనిలేకుండా రోడ్డుమీదకెళతావు..
లక్ష్యంతో ముందుకెళ్లి.. లాక్‌ డౌన్లే పాటించి
జాలి లేని కరోనాను కసితీరా చంపేద్దాం
దేశ ప్రజల రక్షణను బాధ్యతగా భావిద్దాం!

–శర్మ సీహెచ్‌., విజయవాడ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి